న్యూఢిల్లీ: రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కోసం ఇప్పటికే విడుదల చేసిన బయో బబుల్ ప్రొటోకాల్లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసినట్లు రాజస్థాన్ రాయల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఈవో) జేక్ లష్ మెక్రమ్ తెలిపారు. దీంతో టోర్నమెంట్ మొదటి మ్యాచ్ నుంచే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు అందుబాటులో ఉంటారని ధ్రువీకరించారు.
ఐపీఎల్ ఆరంభానికి ముందు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు సిరీస్లో తలపడనున్నాయి. సిరీస్ అనంతరం ఇరుజట్లలోని కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడాల్సి ఉంది. సిరీస్ ముగిసిన తర్వాత యూఏఈ వస్తే వారంతా మళ్లీ ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. దీంతో ఆసీస్, ఇంగ్లీష్ క్రికెటర్లు ఐపీఎల్లోని మొదటి దశ మ్యాచ్లకు దూరం కావాల్సి వస్తుంది.
బయో బబుల్ నుంచి వస్తున్నందున ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లకు యూఏఈలో 6 రోజుల పాటు క్వారంటైన్ అవసరంలేదని ఫ్రాంఛైజీలు బీసీసీఐని కోరాయి. దీంతో ఇటీవల బీసీసీఐ ఐపీఎల్ నియమ నిబంధనల్లో మార్పులు చేశారు. సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభంకానున్న సిరీస్లో ఆతిథ్య ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు మూడు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనున్నాయి. సిరీస్ సెప్టెంబర్ 16న ముగుస్తుంది.
రాయల్స్ టీమ్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. రాజస్థాన్ టీమ్కు స్టీవ్ స్మిత్, సన్రైజర్స్ హైదరాబాద్కు డేవిడ్ వార్నర్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. రాయల్స్ టీమ్లో ఇంగ్లాండ్కు చెందిన జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.